Nov 26,2022 21:01

నిలిచిపోనున్న ఫుడ్‌ డెలివరీ సేవలు
న్యూఢిల్లీ : భారత్‌లోని మరో వ్యాపారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బహుళ జాతి సంస్థ అమెజాన్‌ ప్రకటించింది. ఇటీవల అమెజాన్‌ అకాడమీని మూసివేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా దేశంలోని ఫుడ్‌ డెలివరీ వ్యాపార విభాగం అయినా 'అమెజాన్‌ ఫుడ్‌' కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు అమెజాన్‌ ఇండియా శనివారం ప్రకటించింది. డిసెంబర్‌ 29 నుంచి ఈ సేవలను పూర్తిగా మూసి వేస్తున్నట్లు వెల్లడించింది. ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వ్యాపారాన్ని దశల వారిగా ఉపసంహరించుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ స్విగ్గీ, జమాటా తరహాలో లాభాలను రాబట్టలేక పోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
కంపెనీ వార్షిక కార్యకలాపాల ప్రణాళిక సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ కంపెనీ వెల్లడించింది. భారత్‌లో 20 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడులతో భారత్‌లో అమెజాన్‌ ఫుడ్‌ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు 2020 మేలో ఆ కంపెనీ ప్రకటించింది. తొలుత బెంగళూరు కేంద్రంగా ఈ సేవలను ప్రారంభించింది. భారత్‌లోని అమెజాన్‌ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాంను మూసివేస్తున్నామని అమెజాన్‌ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎలాంటి కారణం చూపకుండానే ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లోనూ పొదుపు చర్యల నేపథ్యంలో పలు వ్యాపారాల మూత, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది.