Jun 27,2023 22:05

సియోల్‌: ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్‌-2023లో భారత్‌ శుభారంభం చేసింది. తొలిరోజు భారత్‌ తలపడిన రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో కొరియాపై 76-13తో నెగ్గిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో చైనీస్‌ తైపీపై 53-20పాయింట్ల తేడాతో నెగ్గి శుభారంభం చేసింది. పవన్‌ షెహ్రావత్‌, నవీన్‌ కుమార్‌, అర్జున్‌ దేశ్వాల్‌, సుర్జీత్‌ సింగ్‌, పర్వేష్‌ మాలిక్‌, నితీశ్‌ కుమార్‌, నితిన్‌ రావల్‌తో కూడిన భారతజట్టు కొరియాతో బరిలోకి దిగింది. తొలి అర్ధభాగం ముగిసే సరికే భారత్‌ నాలుగుసార్లు ప్రత్యర్ధిజట్టును ఆలౌట్‌ చేసింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి భారత్‌ 19-2పాయిఆంట్లతో టాప్‌లో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో మరో నాలుగుసార్లు కొరియాను ఆలౌట్‌ చేయడంతో భారత్‌ 40-4పాయింట్లతో ఏకపక్ష పోరులా సాగింది. 37వ నిమిషంతో తర్వాత కొరియా జట్టు వరుసగా పాయింట్లను సాధించి మొత్తమ్మీద 13పాయింట్లను మాత్రమే సాధించగల్గింది. చైనీస్‌ తైపీతో మ్యాచ్‌ తొలి అర్ధ భాగం మ్యాచ్‌లో నవీన్‌ కుమార్‌ గాయపడ్డాడు. దీంతో తొలి 10నిమిషాల ఆటలో చైనీస్‌ తైపీ భారత్‌కు గట్టి పోటీనిచ్చింది. ఆ తర్వాత పవన్‌ కుమార్‌ వరుసగా పాయింట్లను సాధించాడు. రెండో అర్ధభాగంలో పవన్‌ రైఔడ్స్‌లో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 33పాయింట్ల తేడాతో మ్యాచ్‌ గెలిచింది.