హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. తమ ఉద్యోగులకు మరో విడత కరవు భత్య (డీఏ) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబరు నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు 8 డీఏలను మంజూరు చేశామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని చెప్పారు.