Oct 03,2023 16:15

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్‌ శాఖ అధికారుల నిర్వాకం బయటపడింది. ఓ బంగారం దుకాణానికి నెల రోజులకు గానూ రూ. కోటి కరెంట్‌ బిల్‌ విధించారు. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు పట్టణంలో జీ అశోక్‌ అనే వ్యక్తి ఓ బంగారం దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి అక్టోబర్‌ 2 వరకు అంటే నెల రోజులకు గానూ రూ. 1,01,56,116 కరెంట్‌ బిల్లు విధించారు విద్యుత్‌ అధికారులు. రూ. కోటి కరెంట్‌ బిల్లును చూసిన అశోక్‌ షాకయ్యాడు. విద్యుత్‌ అధికారుల నిర్వాకంపై ఆయన మండిపడ్డాడు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ తనకు ప్రతి నెల రూ. 7 వేల నుంచి రూ. 8 వేల మధ్య కరెంట్‌ బిల్‌ వచ్చేది. కానీ ఈ నెల మాత్రం రూ. కోటి వచ్చిందని, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విద్యుత్‌ అధికారులు విచారణ జరిపి, మళ్లీ కొత్తగా కరెంట్‌ బిల్లు జారీ చేస్తామన్నారు.