Mar 25,2023 22:25

న్యూఢిల్లీ: మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌గా స్వీటీ బూర, నీతు ఘంగాస్‌ నిలిచారు. శనివారం జరిగిన 81కిలోల విభాగం, 48కిలోల విభాగం ఫైనల్లో ప్రత్యర్థులపై గెలిచి ప్రపంచ బాక్సింగ్‌ నయా ఛాంపియన్స్‌గా అవతరించారు. ఫైనల్లో 22ఏళ్ల నీతు ఘంగాస్‌ 5-0పాయింట్ల తేడాతో మంగోలియాకు చెందిన లుట్సారుఖాన్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో నీతు 5-2పాయింట్ల తేడాతో కజకిస్తాన్‌కు చెందిన బెల్కిబెకోను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఇక 81కిలోల లైఫ్‌ హెవీవెయిట్‌ విభాగం ఫైనల్లో స్వీటీ బూర 4-3పాయింట్ల తేడాతో చైనాకు చెందిన వాంగ్‌ాలినాపై పోరాడి నెగ్గింది. రెండోరౌండ్‌ ముగిసే సరికి స్వీటీ 3-2పాయింట్ల ఆధిక్యతలో నిలిచింది. ఇక మూడో రౌండ్‌లో ఇరువురు రక్షణాత్మకంగా ఆడడంతో అంపైర్లు స్వీటీని విజేతగా ప్రకటించారు. 2014 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వీటీ తొలిసారి రజిత పతకం సాధించింది. గతంలో మేరీకోమ్‌, సవిత దేవి, జెన్సీ ఆర్‌ఎల్‌, లేఖా, నిఖత్‌ జరీన్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణ పతకాలను సాధించారు. భారత్‌కు చెందిన మరో ఇద్దరు బాక్సర్లు నిఖత్‌ జరీన్‌(50కిలోలు), లౌలీనా బోర్గోహైన్‌(75కిలోలు) ఫైనల్లో తలపడాల్సి ఉంది.