Dec 15,2022 21:32

ముంబయి : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోమారు వడ్డీ రేట్లను పెంచడంతో భారత మార్కెట్లు భయాందోళనకు గురైయ్యాయి. గురువారం ఉదయం నుంచి తుది వరకు నష్టాల్లోనే సాగాయి. తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 878 పాయింట్లు పతనమై 61,800కు పడిపోయింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 245 పాయింట్ల నష్టంతో 18,414 వద్ద ముగిసింది. ఒక్క పూటలోనే మదుపర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు ఆవిరయ్యింది. అన్ని రంగాల సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఐటి, మీడియా, పిఎస్‌యు షేర్లు అధికంగా 2 శాతం మేర కోల్పోయాయి. వరుసగా నాలుగు భేటీల్లో 0.75 శాతం వడ్డీ రేట్లను పెంచిన ఫెడ్‌ తాజాగా మరోమారు 0.5 శాతం పెంచడంతో పాలసీ రేటు 4.25 శాతం-4.5 శాతానికి చేరింది. వరుస పెంపునకు తోడు 2023 చివరిలోనూ మరోసారి 0.75 శాతం పెంపు ఉండొచ్చన్న సంకేతాలు మదుపర్లను ఆందోళనకు గురి చేశాయి. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపునతో భారత మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు భారీగా తరలిపోయాయని నిపుణులు పేర్కొంటున్నారు.