Jul 07,2022 06:23

ప్రపంచానికి పాఠాలు చెబుతున్న విశ్వగురువు తన కార్యస్థానంలో చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? అన్నింటినీ ఒకేసారి చెప్పుకోలేం గనుక రూపాయి గురించి మోడీ, బిజెపి నేతలు చెప్పిందేమిటో చూద్దాం? ఇప్పుడు జరుగుతున్నదేమిటో చూద్దాం. దాని గురించి వారు మరిచినట్లు నటిస్తున్నా అవసరం గనుక చెప్పుకోక తప్పదు.
''యుపిఏ నిర్వాకం రూపాయి పతనానికి దారి తీసింది : బిజెపి'' 2013 నవంబరు 21న పిటిఐ వార్త శీర్షిక. ''ఎఫ్‌డిఐల ద్వారా ఎఫ్‌ఎఫ్‌ఐల పెట్టుబడులతో నడపాలన్న యుపిఏ విధానం వలన ఈ దుస్థితి ఏర్పడింది. రూపాయి రికార్డు పతనం చెందింది'' (ఆ రోజు ఒక డాలరుకు 60.15 రూపాయలు). ఆ రోజు విలేకర్లతో మాట్లాడింది నాడు రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవిశంకర ప్రసాద్‌. ప్రభుత్వం మీద జోకులు పేలుస్తూ ''యుపిఏ ప్రభుత్వం ఏర్పడినపుడు డాలరు-రూపాయి దామాషా రాహుల్‌ గాంధీ వయసుతో సమానంగా ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ వయసుకు దగ్గరగా ఉంది. అది మన్మోహన్‌ సింగ్‌ వయసును తాకుతుందేమోనని నిజంగానే భయపడుతున్నాం'' అన్నారు.
రవిశంకర ప్రసాద్‌ కంటే ముందు, 2013 ఆగస్టు 20న గాంధీనగర్‌ నుంచి పిటిఐ వార్తా సంస్థ సి.ఎంగా ఉన్న నరేంద్ర మోడీ వ్యాఖ్యల గురించి ఒక వార్తను ఇచ్చింది. ఆరోజు రూపాయి విలువ 64.11కు దిగజారింది. ''ఈ రోజు దేశం ఆశాభంగం చెందింది. ఎందుకంటే ఆర్థిక రంగం గురించి గానీ రూపాయి పతనం గురించి గానీ ప్రభుత్వానికి పట్టలేదు. దాని ఏకైక చింతల్లా కుర్చీని ఎలా కాపాడుకోవాలా అన్నదే. గత మూడు నెలలుగా రూపాయి పతనం చెందుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రూపాయి ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని దేశం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంక్షోభంలో నాయకత్వానికి ఎటు పోవాలో తెలియకపోతే తరువాత నిరాశ పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ధరలు, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తామని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాం. కానీ జరిగిందేమీ లేదు.'' అని బిజెపి ప్రచార కమిటీ నేతగా కూడా ఉన్న మోడీ చెప్పారు.
2018 సెప్టెంబరు మూడున 'ద క్వింట్‌' పత్రిక జర్నలిస్టు మేఖలా శరణ్‌ రాసిన విశ్లేషణను ఒకసారి పరిశీలిద్దాం. ''రూపాయి ఆసుపత్రిలో ఉంది, మృత్యువుతో పోరాడుతోంది'' అని 2013లో నరేంద్ర మోడీ చెప్పారు. ఐదు సంవత్సరాల తరువాత సెప్టెంబరు మూడున రూ. 71.11గా ఉంది. ఈ సమయంలో మోడీ ప్రధానిగా వున్నారు'' అంటూ ఆమె విశ్లేషణ ప్రారంభమైంది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. 2012లో నరేంద్ర మోడీ గట్టిగా ఇలా చెప్పారు. ''నేను పరిపాలనలో కూడా ఉన్నాను. నాకు రూపాయి విలువ గురించి తెలుసు. అది ఇంత వేగంగా పతనం కాకూడదు. ఈ విధంగా పతనం కావటానికి గల కారణాలేమిటి? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఈ దేశం జవాబును డిమాండ్‌ చేస్తోంది'' అన్నారు. మరుసటి ఏడాది బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ ఇలా చెప్పారు. ''ఈ విధంగా రూపాయి విలువ పడిపోవటాన్ని గత రాత్రి చూస్తూ భయపడి టీవీ కట్టేశాను.'' బిజెపి నేతల ఈ ప్రకటనలను ఉటంకించిన ఆజ్‌ తక్‌ టీవీ యాంకర్‌ ''ఇప్పుడు రోజులు మారాయి. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు డాలరుతో రూపాయి విలువ పతనమైంది. ఆయన దేన్ని గురించీ చెప్పటం లేదు.'' అని ముక్తాయింపు ఇచ్చారు. ఎన్‌.డి టీవి యాంకర్‌ రవీష్‌ కుమార్‌ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం మాట్లాడిందీ చూపారు. ''ఈ పతనం (2018) గురించి మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇతర కరెన్సీలు కూడా పతనమౌతున్నంత కాలం...రూపాయి 80 రూపాయలకు పతనమైనా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు.'' గార్గ్‌ మాటల తరువాత ''వంచనకూ ఒక హద్దు ఉంటుంది'' అన్న నరేంద్ర మోడీ చెప్పిన ఒక మాటను చూపించి రవీష్‌ కుమార్‌ ముగించారు. నరేంద్ర మోడీ ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పినా నిత్య సత్యం. కచ్చితంగా కాంగ్రెస్‌ నేతల గురించే చెప్పి ఉంటారు. తరువాత కాలంలో అది తనకూ వర్తిస్తుందని ఊహించి ఉండరేమో!
2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండు వరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. అదే ధరకు 2012లో చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రూ.6,201.05 కాగా ఎనిమిదేళ్ల పాలనలో నరేంద్ర మోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రూ.9,434.29. చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈరోజు మనం ప్రతి పీపాకు పదేళ్ల నాటి కంటే అదనంగా రూ.3,233.24 చెల్లిస్తున్నాము. పదేళ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది. ఇప్పుడు 79 దాటింది. పదేళ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. దీని గురించి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం చెబుతారు? రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్ర మోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోందా లేదా?
2022 జులై ఒకటవ తేదీన 79.20తో రూపాయి పతనం కొత్త రికార్డు నెలకొల్పింది. నరేంద్ర మోడీ వయస్సును దాటి బిజెపి మార్గదర్శక మండలిలో ఉన్న అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటి వారి వయస్సులను అధిగమించేందుకు పోటీ పడుతోంది. త్వరలో 80 దాటనుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఐదు నెలల్లో ఐదు రూపాయలు పతనమైంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచితే మరింతగా కూడా పతనం కావచ్చు. గత ప్రభుత్వం ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఎఫ్‌ఐల మీద ఆధారపడిన కారణంగానే పతనం అన్న నరేంద్ర మోడీ ఇప్పుడు అదే కారణాలతో అంతకంటే ఎక్కువగా పతనం చెందుతున్నా మాట్లాడటం లేదు. పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతున్నది. డిసెంబరులో 31 నాటికి 633.6 బిలియన్‌ డాలర్లుండగా జూన్‌ 24న 593.3 బిలియన్‌ డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో 77-81 మధ్య రూపాయి విలువ కదలాడవచ్చని కొందరి అంచనా. అది ఇప్పుడున్న ముడిచమురు ధరలు అలా ఉంటే అన్న ప్రాతిపదికన అన్నది గమనించాలి. 2022లో 95.6 బిలియన్‌ డాలర్ల మేర చమురు దిగుమతులు చేసుకోగా, ఈ ఏడాది ఆ మొత్తం 145-150 బి.డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. షేర్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవటమే ప్రస్తుత భారీ పతనానికి కారణం. మన దేశం చేస్తున్న ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నందున రూపాయి పతనం కారణంగా ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి. పతనమౌతున్న రూపాయి గురించి ఎవరూ మాట్లాడరేం. మరక మంచిదే అన్నట్లు...రూపాయి పతనం 'మంచి' రోజుల్లో భాగమే అని బిజెపి నేతలైనా చెప్పాలి కదా...మిత్రోం!

mkr

 

 

 

ఎం. కోటేశ్వరరావు