పుణె: సంప్రదాయ ఇంజిన్, విద్యుత్ ప్రయాణికుల వాహనాల కోసం రాబోయే రోజుల్లో ప్రత్యేక ప్లాట్పామ్లను ఏర్పాటు చేస్తామని టాటా మోటార్స్ తెలిపింది. తద్వారా భవిష్యత్ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. అలాగే సంప్రదాయ ప్లాట్ఫామ్లపై ఈవీలను అభివృద్ధి చేయడం వల్ల తలెత్తుతున్న లోపాలను అధిగమించేందుకు మార్గం సుగమమవుతుందని డిజైన్ విభాగాధిపతి మార్టిన్ ఉహ్లారిక్ తెలిపారు.
విద్యుదీకరణ, కనెక్టివిటీ వేగంగా ఊపందుకుంటున్న నేపథ్యంలో సౌలభ్యాన్ని కోరుకుంటున్నారని మార్టిన్ తెలిపారు. భవిష్యత్లో కార్ల లోపలి భాగాన్ని ఒక ఇంటి తరహాలో మార్చాల్సి ఉంటుందన్నారు. సంప్రదాయ ప్లాట్ఫామ్పై ఈవీలను డిజైన్ చేయడం వల్ల దూరం, బ్యాటరీ లేఅవుట్ విషయంలో వాటి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాట్ఫామ్లను విభజించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పరిశ్రమలో ప్రారంభమైందన్నారు. టాటా మోటార్స్ ఈవీలైన నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీలను సంప్రదాయ ఐసీఈ ప్లాట్ఫామ్లపైనే రూపొందించారు.
గత సంవత్సరం టాటా మోటార్స్ సరికొత్త విద్యుత్ వాహన ఆర్కిటెక్చర్ను ఆవిష్కరించింది. దీని మీదే 2025 నుంచి పలు అధునాతన ఈవీ లను డిజైన్ చేయాలని యోచిస్తోంది. 'అవిన్య ' పేరిట తీసుకొస్తున్న ఈ కొత్త ఆర్కిటెక్చర్పై తయారు చేసిన తొలి మోడల్ 2025లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాన్సెప్ట్ 'కర్వ్ 'ను సైతం గత ఏడాది పరిచయం చేసింది.