Oct 25,2022 20:29
  • హెచ్‌యుఎల్‌ ఉత్పత్తుల్లో రసాయనాలు

న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యుఎల్‌) ఉత్పత్తి చేస్తున్న షాంపుల్లో కేన్సర్‌ కారకాలు ఉన్నట్లు తేలింది. ఈ కంపెనీకి చెందిన డవ్‌, ట్రెస్మే, నెక్సస్‌, సువేవ్‌, టిగీ తదితర షాంపుల్లో కేన్సర్‌ కారకాలు ఉన్నట్లు గుర్తించినందున.. ఆ ఉత్పత్తులను రీకాల్‌ చేస్తున్నట్లు స్వయంగా హెచ్‌యుఎల్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కలుషితమైన ఏరోసోల్‌ డ్రై షాంపూ ఉత్పత్తుల వినియోగాన్ని నిలిపి వేయాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. వీటిని వినియోగించడం ప్రమాదమంటూ హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాలను ఆ కంపెనీ తన వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు పేర్కొంది. రీకాల్‌ చేసిన వాటిల్లో అక్టోబరు 2021కి ముందు తయారు చేసిన డ్రై షాంపూ ఏరోసోల్‌ ఉత్పత్తులున్నాయని తెలిపింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్‌ ప్రొపెల్లెంట్‌ కేన్సర్‌ కారకం బెంజీన్‌కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది. వీటి వాడకంతో బెంజీన్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ రీకాల్‌ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది.