Apr 27,2023 22:15

శ్రీలంక 704/3డిక్లేర్డ్‌
గాలే: ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండోటెస్ట్‌లో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 704పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 357పరుగులతో గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంకను మధుశంక, కుశాల్‌ మెండీస్‌ డబుల్‌ సెంచరీలతో ఆదుకున్నారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 268పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మధుశంక(205పరుగులు)ను ఆండీ మెక్‌బ్రైన్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత మాధ్యూస్‌(100నాటౌట్‌), కుశాల్‌ మెండీస్‌(245) కలిసి 3వ వికెట్‌కు 133పరుగులు జతచేశారు. శ్రీలంక జట్టు 151ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 704పరుగులు చేసిన అనంతరం కెప్టెన్‌ కరుణరత్నే ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడు. దీంతో శ్రీలంక జట్టుకు 212పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. హర్నే, మెక్‌బర్న్‌, ఛాప్టర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఐర్లాండ్‌ జట్టు నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 54పరుగులు చేయగా.. ఇంకా 158పరుగులు వెనుకబడి ఉంది.
11 సిక్సర్లు కొట్టిన కుశాల్‌ మెండీస్‌
శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ మిండిస్‌ ఏకంగా 11 సిక్సర్లు కొట్టి మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కర పేర ఉన్న ఓ రికార్డును బ్రేక్‌ చేశాడు. అలాగే శ్రీలంక తరఫున ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2014లో కుమార సంగక్కర బంగ్లాదేశ్‌పై 8సిక్స్‌లు కొట్టి ఈ రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఐర్లాండ్‌పై కుశాల్‌ మెండీస్‌ 11 సిక్సర్లు కొట్టి 9ఏళ్ల క్రితం కుమార సంగక్కర పేర ఉన్న రికార్డును తిరగరాసాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 492 చేసిన సంగతి తెలిసిందే.