Nov 19,2022 09:26

నగదు దాచుకొండి : అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ సూచన

వాషింగ్టన్‌ : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందని అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ఈ సమయంలో కార్లు, రిఫ్రిజిరేటర్లు, టివిలను కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిదన్నారు. కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని బెజోస్‌ సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఈ సీజన్‌లో అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని, డబ్బు దాచుకోవాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులు బాగో లేనందున కొత్త కార్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వాటి జోలికి పోకపోవడమే మంచిందన్నారు.
          ''మీరు ఒక పెద్ద టివి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే.. ఆ యోచనను విరమించుకోండి. మీ నగదును మీ దగ్గరే ఉంచుకోండి. టివి, ఫ్రిజ్‌, కారు అది ఏదైనా కావొచ్చు.. రిస్క్‌కు కాస్త దూరంగా ఉండండి. చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి పెట్టుబడులు పెట్టే యోచన ఉంటే కాస్త ఆలోచించడం మేలు. కొనుగోళ్లకు బదులు నగదు నిల్వలు పెంచుకోండి. కష్టకాలానికి ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉందాం''. అని బెజోస్‌ సూచించారు. ప్రస్తుతం అమెజాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్న బెజోస్‌ గతేడాది సిఇఒగా తప్పుకుని ఆ బాధ్యతలను అండీ జస్సీకి అప్పగించారు. బెజోస్‌ దాదాపు 10 లక్షల కోట్ల సంపద కలిగి ఉన్నారు. తన సంపదలో పెద్ద మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ట్విట్టర్‌, మేటా బాటలోనే ఇటీవల అమెజాన్‌ కూడా 10వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు రిపోర్టులు వచ్చాయి. దీనిని ఆ కంపెనీ వర్గాలు ఖండించక పోయినప్పటికీ వచ్చే ఏడాది నుంచి కోతలు ప్రారంభమవుతాయని సంకేతాలు ఇచ్చింది.