
చెన్నై : నీట్ అభ్యర్థులు ఆత్మ హత్యల ధోరణిని విడనాడి, ఆత్మస్థైర్యంతో జీవితాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం పేర్కొన్నారు. మొదటి ప్రయత్నంలోనే నీట్లో ర్యాంకు సాధించలేదన్న నిరాశతో జగదీశ్వరన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కుమారుని మృతితో దిగులుపడిన తండ్రి సెల్వశేఖరన్ ఆ మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతికి స్టాలిన్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులు , స్నేహితులకు సానుభూతి తెలిపారు. నీట్ బలిపీఠంపై వారి మరణాలు చివరివి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. మరి కొన్ని నెలల్లో దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తాయని, అప్పుడు నీట్ కోరుకునేవారు అదృశ్యమవుతారని రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవిని సూచిస్తూ పేర్కొన్నారు.
నీట్ వ్యతిరేక బిల్లుపై తాను సంతకం చేయబోనని రాష్ట్ర గవర్నర్ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో నీట్ సంబంధిత ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. ''విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని, మీ అభివృద్ధికి అడ్డుగా నిలిచే నీట్ను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది'' అని అన్నారు. నీట్ పరీక్ష ఖరీదైనదిగా మారిందని, ధనవంతులు మాత్రమే భరించగలిగేలా ఉందని అన్నారు. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టీ చదువుకొనలేని వారు పరీక్షలో ఫెయిలవుతున్నారని... డబ్బున్న వారికే వైద్య విద్య అన్న పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు మెడికల్ కాలేజీల్లో 7.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందని అన్నారు. కాని గవర్నర్ మాత్రం కోచింగ్ సెంటర్లకు తోలుబమ్మగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ఇస్తున్న తేనెటి విందును బహిష్కరిస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. సెల్వశేఖర్ కుటుంబ సభ్యులను స్టాలిన్ కుమారుడు, మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ పరామర్శించారు.