Oct 26,2022 20:31
  • కేరళ కార్మిక శాఖ మంత్రి చొరవ
  • యాజమాన్యంపై విచారణకు ఆదేశం

తిరువనంతపురం : ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ తన ఉద్యోగులను రాజీనామా చేయాలని ఒత్తిడి చేసింది. తిరువనంతపురంలోని టెక్నోపార్క్‌లోని ఆ సంస్థ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యోగుల రాజీనామాపై ఒత్తిడిని పెంచడంతో అక్కడి సిబ్బంది కేరళ కార్మిక శాఖ మంత్రి వి శివకుట్టిని కలిసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటుగా విచారణకు ఆదేశించారు.
'' టెక్నో పార్క్‌లో పని చేస్తున్న బైజూస్‌ యాప్‌ ఉద్యోగులు నన్ను కలిశారు. ఈ పార్క్‌లోని ఐటి ఎంప్లాయిస్‌ వెల్పేర్‌ ఆర్గనైజేషన్‌ ఈకో ఆఫ్‌ టెక్నోపార్క్‌ ఆఫీసు బేరర్లు ఉద్యోగుల తొలగింపు, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో కార్మిక శాఖ సీరియస్‌ విచారణ చేపట్టనుంది.'' అని శివన్‌కుట్టి ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. ఈ శాఖలో 170 మంది పైగా ఉద్యోగులు పని చేస్తున్నారని.. వారంత అక్టోబర్‌ 25న తమను కలిశారని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్బంగా పరిహారం, బకాయి వేతనాలను కూడా ఇప్పించాలని వారు కోరారని తెలిపారు.
ఉద్యోగులను రాజీనామా చేయాలని బైజూస్‌ యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని టెక్నోపార్క్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ తమను తొలగించాల్సి వస్తే అక్టోబర్‌ వేతనాలు సహా.. వచ్చే మూడు మాసాలకు సంబంధించిన అడ్వాన్స్‌ వేతనాలను కూడా పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఎర్నింగ్‌ సెలవులు సహా ఇతర చట్టబద్ద చెల్లింపులు చేయాలని వారు మేనేజ్‌మెంట్‌ను కోరుతున్నారు.
ప్రస్తుతం బైజూస్‌ 22 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.80 లక్షల కోట్లు) విలువ చేస్తుందని అంచనా. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగి రూ.10,000 కోట్లుగా నమోదయ్యాయి. ఈ సంస్థలో దాదాపుగా 50వేల మంది పని చేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో దశల వారిగా 5 శాతం అంటే 2500 మందిని తొలగించాలని నిర్దేశించుకున్నట్లు ఆ సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రకటనపై బైజూస్‌ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సహా ఇప్పుడు కూడా తమ ద్వారా భారీ మొత్తంలో రెవెన్యూ ఆర్జిస్తున్న బైజూస్‌ చర్యలను వారు ఆక్షేపిస్తున్నారు.