Feb 21,2023 22:05

చివరి రెండు టెస్టులకు దూరం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జట్టుకు గాయాల బెడద వెంటాడుతోంది. భారత్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టులకు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తప్పిస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్‌బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్‌ కాంకషన్‌ వల్ల మ్యాచ్‌ మధ్యలోనే తప్పుకున్న విషయం తెలిసిందే. సిరాజ్‌ బౌలింగ్‌లో బంతి వార్నర్‌కు తగిలింది. దీంతో వార్నర్‌ కాంకషన్‌ తీసుకున్నాడు. అతని స్థానంలో రెన్‌షాను ఆ మ్యాచ్‌లో ఆడించారు. అయితే ఇంకా ఫిట్‌ కాకపోవడంతో వార్నర్‌ను టెస్టు సిరీస్‌ నుంచి పూర్తిగా తప్పించారు. వార్నర్‌ మోచేతికి స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయినట్లు కూడా గుర్తించారు. కొంత సమయం రిహాబిలిటేషన్‌ అవసరమని, అందుకే అతనికి విశ్రాంతిస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఏ) వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఇప్పటికే దూరం కాగా.. గాయంతో హేజిల్‌ వుడ్‌ ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.