న్యూఢిల్లీ : భారత కరెంట్ ఖాతా లోటు (సిఎడి) ప్రమాదకరంగా నమోదవుతుంది. దేశ ఎగుమతులు పడిపోవడం, దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు ఎగిసిపడుతోంది. దీంతో జిడిపిలో సిఎడి భారీగా పెరిగి ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం(క్యూ2)లో జిడిపిలో కరెంట్ ఖాతా లోటు 4.4 శాతానికి చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం ఓ రిపోర్టులో వెల్లడించింది. ఇంతక్రితం ఏప్రిల్ ా జూన్ కాలంలో ఇది 2.2 శాతంగా ఉంది. దీంతో పోల్చితే గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో సిఎడి రెట్టింపు అయ్యింది. ''2022-23 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కరెంట్ ఎకౌంట్ లోటు 36.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3 లక్షల కోట్లు)తో జిడిపిలో 4.4 శాతంగా నమోదయ్యింది. ఇంతక్రితం జూన్ త్రైమాసికంలో ఇది 18.2 బిలియన్ డాలర్ల (రూ.1.5 లక్షల కోట్లు)తో జిడిపిలో 2.2%గా ఉంది. 2021ా22 ఇదే క్యూ2లో 9.7 బిలియన్ డాలర్ల (రూ.80వేల కోట్లు)తో జిడిపిలో 1.3%గా నమోదయ్యింది.'' అని ఆర్బిఐ తెలిపింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో వాణిజ్య లోటు 83.5 బిలియన్ డాలర్ల (6.91 లక్షల కోట్లు)కు ఎగిసింది. జూన్ త్రైమాసికంలో ఇది 63 బిలియన్ డాలర్లుగా (రూ.5.21 లక్షల కోట్లు) ఉంది. దిగుమతులు పెరగడం.. ఎగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు ఏర్పడుతుంది. దేశ దిగుమతుల, అప్పులు, ఇతర విదేశీ చెల్లింపులు ఎక్కువగా ఉండి విదేశీ మారకం రాక తక్కువగా ఉంటే కరెంట్ ఎకౌంట్ లోటు చోటు చేసుకుంటుంది. ప్రపంచ దేశాల్లో భారత ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఎగుమతులు పడిపోతున్నాయి. మరోవైపు దేశీయంగా దిగుమతులకు అధిక డిమాండ్ ఉండటంతో వాణిజ్య లోటు పెరుగుతోంది. మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో పెద్ద పురోగతి లేకపోవడంతో భారత్ అనేక ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత అప్పులు భారీగా పెరగడంతో విదేశీ చెల్లింపులు భారం అవుతున్నాయి. ఈ పరిణామాలు భారీ కరెంట్ ఎకౌంట్ లోటుకు దారి తీస్తున్నాయి.










