Dec 15,2022 21:08

న్యూఢిల్లీ : దేశ ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడంతో ఎగిసిన వాణిజ్య లోటు వల్ల భారత కరెంట్‌ ఎకౌంట్‌ లోటు పెరుగొచ్చని రాయిటర్స్‌ పోల్‌లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి విలువ బలహీనపడటం, కమోడిటీ ధరలు పెరగడం, హెచ్చు వాణిజ్య లోటు తదితర పరిణామాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కరెంట్‌ ఎకౌంట్‌ లోటు (సిఎడి) పెరగనుందని 18 మంది ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. భారత్‌కు విదేశాల నుంచి వచ్చే ఆదాయాల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉండటాన్నే కరెంట్‌ ఎకౌంట్‌ లోటుగా పేర్కొంటారు. డిసెంబర్‌ 5-14 తేదిల్లో రాయిటర్స్‌ ఈ సర్వే చేసింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో 35.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.93 లక్షల కోట్లు) కరెంట్‌ ఎకౌంట్‌ లోటు నమోదు కావచ్చని నిపుణుల అంచనా. ఇది జిడిపిలో 4.3 శాతానికి సమానం. ఇంతక్రితం ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికంలో 23.9 బిలియన్‌ డాలర్లు (రూ.1.97 లక్షల కోట్లు) సిఎడి నమోదయ్యింది. 2022 ఏడాదికి భారత్‌కు విదేశీ అంశాల పరంగా చాలా సవాళ్ల సమయమని డచ్‌ బ్యాంక్‌ ఎకనామిస్ట్‌ కౌసిక్‌ దాస్‌ పేర్కొన్నారు.