Nov 15,2023 09:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:తెలుగుదేశం పార్టీకి సంబందించిన బ్యాంకు ఖాతాల వివరాలను అందించాలని ఎపి సిఐడి ఆ పార్టీకి మరోమారు నోటీసు అందజేసింది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సిఐడి అధికారులు మంగళవారం వెళ్లి నోటీసులను కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు అందజేశారు. టిడిపి బ్యాంకు ఖాతాల వివరాలను ఈ నెల 18లోగా ఇవ్వాలని ఆ నోటీసులో సిఐడి పేర్కొంది. స్కిల్‌ డెవలప్‌మెంటు కేసు నేపథ్యంలో పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ సిఐడి కోరింది. బ్యాంకు ఖాతాల వివరాలను తెలపాలంటూ గతంలో సిఐడి ఇచ్చిన నోటీసుకు స్పందించకుండా రాజకీయ పార్టీలకు సంబంధించి విరాళాలను అడగడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర హైకోర్టును టిడిపి ఆశ్రయించింది. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణలో వుంది. సిఐడి రెండోసారి ఇచ్చిన నోటీసుపై కూడా టిడిపి స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.