Mar 13,2023 05:15

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టీమ్‌ ఇండియా సొంతమవటం ఖాయమైంది. అహ్మదాబాద్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కొండంత స్కోరు ముందున్నా.. అలవోకగా ఆధిక్యం దక్కించుకుంది భారత్‌. మూడేండ్లుగా శతకం కోసం ఎదురుచూసిన విరాట్‌ కోహ్లి (186) సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. శుభ్‌మన్‌ గిల్‌ (128), అక్షర్‌ పటేల్‌ (79)లు సైతం మెరవటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 571 పరుగులు చేసింది. చివరి టెస్టులో ఆస్ట్రేలియాకు పెద్దగా అవసరం లేదు. నెగ్గినా.. ఆ జట్టుకు సిరీస్‌ దక్కదు. కానీ భారత్‌కు అత్యవసరం. ఈ టెస్టులో విజయం సాధిస్తే ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో నేరుగా చోటు దక్కించుకోవచ్చు. లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, అహ్మదాబాద్‌ టెస్టులో నాలుగు రోజుల ఆట ముగిసింది. 12 సెషన్ల ఆటలో రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే ముగిశాయి. ఇంకా రెండు ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. మరో మూడు సెషన్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ మూడు సెషన్లలో ఆస్ట్రేలియా పది వికెట్లు పడగొట్టడంతో పాటు ఆ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్‌ ఛేదించాలి. పిచ్‌ స్వభావం, స్పందిస్తున్న తీరు చూస్తే అది సాధ్యపడే పరిస్థితి లేదు. దీంతో భారత్‌, ఆస్ట్రేలియా నాల్గో టెస్టులో డ్రా తప్పదనిపిస్తుంది. చివరి రోజు పిచ్‌ పగుళ్లు తేలి స్పిన్‌కు అనుకూలిస్తే మినహా.. నేడు ఆటలో ఫలితం ఆశించే అవకాశం ఏమాత్రం లేదు.