- ఇద్దరు నిందితుల అరెస్టు : డిఎస్పి
ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య జిల్లా), జమ్మలమడుగు : ఎలాంటి అనుమతులు లేని రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను రాయచోటి డిఎస్పి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని బోయపల్లికి చెందిన ఇద్దరు యువకులు లింగం బాలకృష్ణ, దాసరి గంగాధర్ నాటు తుపాకులతో వేటకు వెళ్లారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. తుపాకులకు లైసెన్సులు లేకపోవడంతో ఇద్దరి యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
జమ్మలమడుగులో నాటు బాంబు కలకలం
కడప జిల్లా జమ్మలమడుగులో నాటు బాంబు కలకలం రేగింది. పట్టణంలోని ముద్దనూరు రోడ్డు పెన్నానది సమీపాన ఉన్న రియల్ ఎస్టేల్ స్థలంలో శుక్రవారం ఉదయం స్థానికులు బాంబును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రత్యేక పోలీస్ బృందంతో సంఘటనా స్థలాన్ని డిఎస్పి నాగరాజు, అర్బన్ సిఐ సదాశివయ్య సందర్శించారు. బాంబును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. 2019 జులై 23న అదే స్థలంలో 54 నాటు బాంబులు లభ్యమయ్యాయి. మళ్లీ అదే ప్రాంతంలో బాంబు లభ్యం కావడంతో జమ్మలమడుగు ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.










