Dec 24,2022 21:02

రూ.25వేల ఆదాయం వారిపై ఆంక్షలు
గుర్తించిన బాలల హక్కుల కమిషన్‌

న్యూఢిల్లీ : దేశంలో ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్థ మరింత అసమానతలు పెంచుతుందడానికి బైజూస్‌ విధానాలే నిదర్శనం. పేద వారికి ట్యూషన్లు చెప్పబోమని స్పష్టం చేసింది. నెలకు రూ.25వేల లోపు ఆదాయం కలిగిన వారికి చదువులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆ ఎడ్‌టెక్‌ సంస్థ వెల్లడించింది. ఈ విషయమై విచారణ చేపడుతున్నామని.. బైజూస్‌ సిఇఒకు నోటీసులు జారీ చేయనున్నట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సిపిసిఆర్‌) తెలిపింది. రూ.25,000 దిగువన ఆదాయాలు కలిగిన కుటుంబాలకు ట్యూషన్లను లేదా రుణ ఆఫర్లను నిలిపి వేసే ప్రక్రియను ప్రారంభించామని బైజూస్‌ వ్యవస్థాపకుల్లో ఒక్కరైన ప్రవీన్‌ ప్రకాష్‌ సందర్బోచితంగా తనతో చెప్పారని ఎన్‌సిపిసిఆర్‌ చైర్‌పర్సన్‌ ప్రయాంక్‌ కానూంగో తెలిపారు.
పిల్లలు, వారి తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లను బైజూస్‌ కొంటుందని.. వీటితో వారికి ఫోన్లు చేసి తమ కోర్సులను కొనాలని తీవ్ర ఒత్తిడి చేస్తుందని ఎన్‌సిపిసిఆర్‌ ఇటీవల వెల్లడించింది. తమ కోర్సులను కొనకపోతే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. బైజూస్‌ పని సంస్కృతి, ఖాతాదారుల పట్ల తన విధానాన్ని బహిర్గతం చేసిన రెండు అంశాలపై సమన్లు జారీ చేయగా.. ఈ విషయమై శుక్రవారం ఆ కంపెనీ ప్రతినిధులను విచారణకు హాజరయ్యారు. ఆ సంస్థ సిఇఒకు బదులుగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ హాజరయ్యారు. ఈ విచారణలో పేద వర్గాలకు చదువును నిరాకరిస్తున్నట్లు వెల్లడయ్యిందని కానూంగో తెలిపారు.
''బైజూస్‌ రీఫండ్‌ పాలసీని విచారించాం. ఇదే సమయంలో అనేక మంది ఖాతాదారులను ఇంటర్యూ చేశాం. వారు కోర్సులను కొనుగోలు చేయడంలో దోపిడికి, మోసానికి గురైయ్యామని తెలిపారు. చివరికి వారి ఫీజును వాపసు పొందలేకపోయారు. మేము టెక్‌ కంపెనీ పనితీరును నియంత్రించలేము. కానీ వారి దోపిడి వ్యూహాల ప్రభావం ఖచ్చితంగా మా పరిధిలో ఉంటుంది'' అని కానూంగో రాయిటర్స్‌తో తెలిపారు.
''బైజూస్‌ నమోదు చేసుకున్న విద్యార్థులతో పరిచయం ఉన్న ఉపాధ్యాయులు, మెంటర్‌లతో సహా తన సిబ్బంది అందరి జాబితాను మాకు ఇవ్వాలని విచారణలో కోరాం. తన వెబ్‌సైట్‌లో ఫిర్యాదులను ఎక్కడ ఫైల్‌ చేయాలనే వివరాలను ప్రముఖంగా ప్రదర్శించాలని సూచించాం. తల్లిదండ్రుల ఆందోళనలను వెంటనే పరిష్కరించేలా చూసుకోవాలని చెప్పాం. కంపెనీ యొక్క దూకుడు విధానాల వల్ల పిల్లలు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న మానసిక గాయం నుండి నేడు కొంత ఉపశమనం పొందారు'' అని కానూంగో తెలిపారు.
కాగా.. ఎన్‌సిపిసిఆర్‌ ఛైర్మన్‌ విమర్శలను బైజూస్‌ ఖండించడం కానీ.. అంగీకరించడం కానీ చేయలేదు. తమ సంస్థ నేరుగా విద్యార్థుల కుటుంబాలకు రుణాలు అందించడం లేదని.. కానీ థర్డ్‌ పార్టీ విత్త సంస్థల ద్వారా ఖాతాదారులకు కనెక్ట్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఎన్‌సిపిసిఆర్‌ వద్ద బలమైన విధానాలను సమర్పించామని.. ప్రతీ సమస్యను బోర్డులోకి చర్చిస్తామని ఆ సంస్థ ప్రతినిధి విచారణ అనంతరం తెలిపారు.