Jan 06,2023 09:40

భువనేశ్వర్‌ : అతిపెద్ద టెలికాం సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్‌ వచ్చే ఏడాది నుంచి 5జి సేవల్ని అందించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఉదయం ఒడిశాలో జియో, ఎయిర్‌టెల్‌ల 5జి సేవలను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టెలికాం మంత్రితోపాటు, కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ఒడిశాలో టెలికాం సర్వీసులకు 2022-23 సంవత్సరానికి గాను నరేంద్ర మోడీ ప్రభుత్వం 5,600 కోట్లను మంజూరు చేసింది. ఈ రాష్ట్రంలో ప్రపంచస్థాయి కమ్యూనికేషన్‌ సౌకర్యాల కోసం 5,000 మొబైల్‌ టవర్స్‌ ఏర్పాటు చేస్తాం. రెండు సంవత్సరాల్లోనే ఒడిశా 5జి సేవల పరిధిలోకి వస్తుంది. భువనేశ్వర్‌, కటక్‌లలో 5జి సేవలు ప్రారంభించాము. జనవరి 26 లోపు 5జి సేవలను ప్రారంభించాలనే నిర్ణయానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వచ్చే ఏడాది నుంచి బిఎస్‌ఎన్‌ఎల్‌ 5జి సేవలు అందబాటులోకి రానున్నాయి.' అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఒడిశాలోని గ్రామీణ ప్రాంతాల్లో 4జి సేవల కోసం 100 టవర్లను ఏర్పాటు చేసినట్లు టెలికాం సెక్రటరీ కె. రాజారామన్‌ తెలిపారు.
కాగా, ఫిబ్రవరి 2023 నాటికి రూర్కెలా, బెర్హంపూర్‌, పూరీ, సంబల్‌పూర్‌, బాలాసోర్‌ నగరాలను కవర్‌చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా జియో 5జి నెట్‌వర్క్‌ వేగంగా విస్తరించనుందని ఆ తర్వాత డిసెంబర్‌ చివరి నాటికి ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి రానున్నాయని జియో రిలయన్స్‌ ఓ ప్రటకనలో వెల్లడించింది.