- వేలానికి తాడేపల్లిగూడెం, కొండపల్లి ప్రాపర్టీలు
- జాబితాలో 13 ఆస్తులు
న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి సర్కార్ బిఎస్ఎన్ఎల్ ఆస్తులను విభజించి విక్రయించే పనిలో పడింది. ఆంధ్రప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాల్లోని బిఎస్ఎన్ఎల్ ఆస్తుల వేలానికి మోడీ సర్కార్ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లోని బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన 13 ఆస్తులను కేంద్రం వేలానికి పెట్టింది. వీటికి డిసెంబర్ 5 నుంచి బిడ్డింగ్లను అహ్వానిస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ఆస్తులను ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టనుంది. ఆస్తుల నగదీకరణలో భాగంగా వీటిని అమ్మేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ ఎంస్టిసితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఆస్తుల విలువ రూ.20,160 కోట్లుగా ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) అంచనా వేసింది. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న బిఎస్ఎన్ఎల్ను ఆదుకుంటామంటూనే కేంద్రం ఈ చర్యలకు పాల్పడటం గమనార్హం. బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ సంస్థలకు రూ.69వేల కోట్ల ఆర్థిక మద్దతును అందిస్తామని 2019లో మోడీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఆ సంస్థల ఆస్తుల విక్రయాన్ని చేపట్టడం ఆందోళనకరం.










