Nov 16,2022 21:16
  • ఇతర టెక్‌ కంపెనీల కంటే అధిక ఉద్వాసనలు

న్యూఢిల్లీ : అమెరికన్‌ కంపెనీ అమెజాన్‌ భారత్‌లో అత్యధిక మంది ఉద్యోగులను తొలగించిందని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. ఇటీవల ట్విట్టర్‌, మెటా తదితర టెక్‌ కంపెనీల తొలగింపులతో పోల్చితే భారత్‌లో అమెజాన్‌ ఉద్వాసనలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఈ సంస్థ వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించిందని సమాచారం. దేశంలో అమెజాన్‌కు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా ఈ సంస్థ పని చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 11వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా, 3500 పైగా సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ట్విట్టర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్‌లో తొలగింపులు ప్రారంభమయ్యాయని అమెజాన్‌ ఉద్యోగులు లింక్డిన్‌లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బృందం మొత్తాన్ని తొలగించారని అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా పనిచేసిన ఓ ఉద్యోగి వాపోయారు.