Oct 21,2022 21:26

న్యూఢిల్లీ : బ్యాంక్‌లు, విత్త సంస్థల నుంచి ఇప్పటికే లక్షల కోట్లు అప్పులు పొందిన అదానీ గ్రూపు మరిన్ని రుణాలపై దృష్టి పెట్టింది. గౌతమ్‌ అదానీకి చెందిన పలు కంపెనీలు వచ్చే ఏడాది కాలంలో దాదాపు రూ.82 వేల కోట్ల (10 బిలియన్‌ డాలర్లు) కొత్త అప్పుల కోసం కసరత్తు చేస్తున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ఇప్పటికే తీసుకున్న పలు అప్పులను తిరిగి చెల్లించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు కావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాయని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్టు చేసింది. 10 బిలియన్‌ డాలర్లలో 6 బిలియన్‌ డాలర్లను ఇప్పటికే ఉన్న రుణాలను పునర్‌వ్యవస్థీకరించేందుకు ఉపయోగించనుందని సమాచారం. మిగిలిన నాలుగు బిలియన్‌ డాలర్లను కంపెనీ విస్తరణ, కొనుగోళ్లకు వ్యయం చేయవచ్చని తెలుస్తోంది.