ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లమో కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్-2023 పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. సాంకేతిక విద్య కమిషనర్ సిహెచ్ నాగరాణి ఇందుకు సంబంధించిన ఆనలైన్ ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సాంకేతిక విద్య కమిషనర్ కార్యాలయంలో వివరాలతో కూడిన కరపత్రాన్ని కూడా ఆవిష్కరించారు. పాలిసెట్కు ఏప్రిల్ 30వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. మే 10వ తేదీన పరీక్ష ఆఫ్లైన్ విధానంలో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు polycetap.nic.in సందర్శించాలన్నారు. మరిన్ని వివరాలను సమీపంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోని సహాయ కేంద్రం వద్ద పొందవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య సంయుక్త సంచాలకులు పద్మారావు, శిక్షణ మండలి కార్యదర్శి విజయభాస్కర్ పాల్గొన్నారు.










