Sep 14,2023 06:57
  • రూ.7,210 కోట్లతో ఈ-కోర్టు ప్రాజెక్టు
  • కేంద్ర మంత్రి వర్గం ఆమోదం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే మూడేళ్ళలో కొత్తగా 75 లక్షల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రూ.7,210 కోట్లతో ఈ-కోర్టు ప్రాజెక్టు మూడో దశ వంటి పలు నిర్ణయాలను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. అనంతరం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ మీడియాకు వెల్లడించారు. మెసర్స్‌ సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌లో రూ.9,589 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అందిన ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది.
రూ.7,210 కోట్లతో ఈ-కోర్ట్స్‌ మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టు మూడో దశకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. న్యాయ వ్యవస్థలో మరింత పారదర్శకత, కాగిత రహిత కార్యకలాపాల కోసం రూపొందించిన ఈ- కోర్టులను వచ్చే నాలుగేళ్లలో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఫైలింగ్‌, ఈ పేమెంట్‌ వ్యవస్థకు ఉపయుక్తంగా ఉండే కోర్టు కాంప్లెక్సుల్లో 4,400 ఈ-సర్వీసు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రూ.1,650 కోట్లతో మరో 75 లక్షల గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని అన్నారు. ఉజ్వల యోజనకు అదనంగా మూడేళ్ల వీటిని పంపిణీ చేస్తామని తెలిపిందన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసినందుకుగాను యావత్‌ దేశ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలుపుతూ చేసిన ఓ తీర్మానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.