Jun 14,2023 21:40

న్యూఢిల్లీ : భారత్‌లోని స్టార్టప్‌ సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. నిధుల సమీకరణలో సవాళ్లను చవి చూస్తున్నాయి. ప్రస్తుత ఏడాదిలో (జనవరి నుంచి మే) కాలంలో స్టార్టప్‌ సంస్థలకు సంబంధించి 5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.41వేల కోట్లు)విలువ చేసే 461 ఒప్పందాలు జరిగాయని మార్కెట్‌ ఇంటిలిజెన్సీ వేదిక ట్రాక్సన్‌ వెల్లడించింది. ఇంతఇకతం ఏడాది ఇదే సమయంలోని 17.1 బిలియన్‌ డాలర్ల (రూ.1.40 లక్షల కోట్లు) ఫండింగ్స్‌తో పోల్చితే 71 శాతం పతనం చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు టెక్నలాజీ ఉత్పత్తుల స్టార్టప్‌లు 1.6 బిలియన్‌ డాలర్ల (రూ.13వేల కోట్లు) నిధులను సమీకరించగలిగాయి. తర్వాత స్థానంలో ఫిన్‌టెక్‌ రంగం 1.4 బిలియన్‌ డాలర్ల (రూ.11.4 వేల కోట్లు) నిధులను పొందాయి. ముఖ్యంగా ఫోన్‌పే 850 మిలియన్‌ డాలర్ల సేకరణతో ఫిన్‌టెక్‌ రంగం అధిక నిధులను నమోదు చేసింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక మందగమనం.. టెక్‌ కంపెనీలు పొదుపు చర్యలకు దిగడం తదితర అంశాలు స్టార్టప్‌ల నిధుల సమీకరణలో ప్రతికూలతలను పెంచుతున్నాయి. గడిచిన ఏడాది 2022లో స్టార్టప్‌లకు ఫండ్స్‌ 33 శాతం తగ్గి 24 బిలియన్‌ డాలర్ల (రూ.1.95 లక్షల కోట్లు)కు పరిమితమయ్యాయయని పిడబ్ల్యుసి ఇండియా ఇటీవల ఓ రిపోర్టులో తెలిపింది. 2021లో ఈ సంస్థలు 35.2 బిలియన్‌ డాలర్ల (రూ.2.85 లక్షల కోట్లు)ను సమీకరించగలిగాయి. ఈ రంగంలో ఫండింగ్‌ తగ్గిపోవడంతో పాటు భారీగా ఉద్యోగాలు ఊడుతోన్న విషయం తెలిసిందే. స్టార్టప్‌లకు నిధుల మద్దతులో కేంద్ర ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించకపోవడం, బడా కార్పొరేట్లకు కొమ్ము కాయడం వల్లే అవి ఒత్తిడిలోకి జారుకుంటున్నాయని.. కొత్తవి రాలేకపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.