హైదరాబాద్: పాతబస్తీ మెట్రోరైలు పనులకు హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు మొదలు పెట్టింది. నెలరోజుల్లో భూసేకరణకు నోటీసులు జారీ చేస్తామని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు రైలు నడిపేందుకు గతంలో ప్రతిపాదన వచ్చింది. అయితే, భూ సేకరణలో సమస్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు హెచ్ఎంఆర్ఎల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. పాతబస్తీలో మెట్రోరైలు మార్గంలో 5 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని, వాటిలో 4 నిర్మాణాల విషయంలో సమస్యలు తలెత్తాయని తెలిపారు. త్వరలోనే వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు.
ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గం నిమిత్తం 5.5 కిలోమీటర్ల మెట్రోరైలు నిర్మాణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. మెట్రో రైలు తొలివిడత కింద 69.2 కిలోమీటర్లు నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులెత్తేసింది. రాయదుర్గంతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించటంతో పాటు, నిలిచిపోయిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తీర్ణం 74.7 కిలోమీటర్లకు అవుతుంది. సుమారు ఆరేడు సంవత్సరాలుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం నిలిచిపోయింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావటంతో అప్పట్లో మజ్లిస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మార్గాన్ని మళ్లించేందుకు(ఎలైన్మెంట్) సర్వే నిర్వహించినా ముందడుగు పడలేదు.










