Nov 25,2022 21:30

న్యూఢిల్లీ : భారత్‌లో ఐటి, ఐటి ఆధారిత రంగాల్లో నూతన నియామకాలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చిత్తి కారణంగా గడిచిన అక్టోబర్‌ మాసంలో ఐటి, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బిపిఎం) విభాగాల్లో కొత్త నియామకాలు 43 శాతం పతనమయ్యాయని సిఐఇఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ శుక్రవారం ఓ రిపోర్టులో తెలిపింది. టాప్‌ 50 ఐటి, బిపిఎం కంపెనీల నుంచి సేకరించిన సమాచారంతో ఈ రిపోర్టును రూపొందించినట్లు సిఐఇఎల్‌ హెచ్‌ర్‌ సర్వీసెస్‌ పేర్కొంది. ఆ వివరాలు.. 2022 జనవరి నుంచి సెప్టెంబర్‌ మాసాల్లోని సగటు నియామకాలతో పోల్చితే 43 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. సెప్టెంబర్‌ నూతన నియామకాలతో పోల్చితే అక్టోబర్‌లో 4 శాతం తగ్గుదల నమోదయ్యింది. ఇదే సమయంలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో నియామకాలు ఏకంగా 10 శాతం తగ్గాయి.
''భవిష్యత్తు సాఫ్ట్‌వేర్‌ తప్పనిసరి అయితే తప్పా కంపెనీలు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలకు తోడు స్టార్టప్‌లకు నిధుల కొరత తదితర అంశాలు కొత్త నియామకాలపై ప్రభావం చూపుతున్నాయి.'' అని సిఐఇఎల్‌ హెచ్‌ సర్వీసెస్‌ సిఇఒ, ఎండి ఆదిత్యా నారాయన్‌ మిశ్రా పేర్కొన్నారు. మరోవైపు ట్విట్టర్‌, మెటా, అమెజాన్‌, హెచ్‌పి తదితర దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఉన్న ఉద్యోగాలు ఊడుతుంటే.. మరోవైపు కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ రంగంపై ఆశలు పెంచుకున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.