Aug 03,2023 21:51

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖలోని ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు కిముడు చిన్నం నాయుడు, ప్రధాన కార్యదర్శి రూడ సత్యారావు మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఆదివాసీలపై 90 రోజులుగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సహకారంతో అకృత్యాలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని, ఆదివాసి మహిళలను నగంగా ఊరేగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మారణ హోమంలో సుమారు 200 మంది ఆదివాసీలు మరణించారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో మెయితీ గిరిజనేతర జాతులకు గిరిజన హోదా కల్పించి ఆదివాసి ప్రాంత సహజ వనరులను బడా కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పడాన్ని కుకీ, నాగా ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఆదివాసి ప్రాంతంలో అపారమైన సహజ వనరులను బడా కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని, దీనిని రద్దు చేసి అటవీ హక్కుల చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బోయ /వాల్మీకులను ఎస్‌టిల్లో చేరుస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని, జిఒ 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని, పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలను ఐదవ షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో నేతలు కె.రామారావు, గాసాడి వెంకట రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.