అమరావతి : ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయవద్దు... సర్కులర్ 172ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర , జిల్లా శాఖ కమిటీల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్క్యులర్ 172 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1,2 తరగతుల అంగన్వాడి వ్యవస్థకు విలీనం చేసి 3, 4, 5 తరగతుల ఉన్నత పాఠశాలలకు విలీనం చేయనుందని తెలిపారు. ఈ సర్క్యులర్ అమలైతే ప్రాథమిక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని హెచ్చరించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 1కిలో మీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలనే నిబంధనకు ఈ సర్కులర్ విరుద్దమని తెలిపారు. పేద విద్యార్దులు ప్రాథమిక విద్యకు దూరం అవుతారని, డ్రాపౌట్లు పెరిగిపోతారని అన్నారు. బాలికల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడి వ్యవస్థ లక్ష్యాలు దెబ్బతింటాయని తెలిపారు. జాతీయ నూతన విద్యావిధానం 2020తో వేల సంఖ్యలో ప్రాధమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని అన్నారు. ప్రాథమిక పాఠశాలలను యధాతథంగా నిర్వహించాలని, సర్కులర్ 172ని రద్దు చేయాలని, అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలలో విద్యార్ధి, యువజన, కార్మిక సంఘాలతో పాటు ఇతర ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు మద్దతుగా పాల్గొన్నాయి.



















