ప్రజాశక్తి - చిలమత్తూరు : ఆంద్రా, కర్నాటక సరిహద్దు మండలంగా ఉన్న చిలమత్తూరు వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలనిఅక్రమ మద్యం సరఫరా, గుట్కా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పోలీసులను అదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం చిలమత్తూరు పోలీస్ స్టేషన్ను తనిఖీచేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, కేసు డైరీ, విలేజ్ రోస్టర్, క్రైమ్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పాత నేరస్తులు రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. సమస్యత్మక గ్రామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత గ్రామాలలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి చట్టపరమైన సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










