హైదరాబాద్ : చిన్న పదవికే రేవంత్ పిఎం లా ఫోజుకొడుతున్నారంటూ.. టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటి.రామారావు విమర్శనాస్త్రాలు సంధించారు. సింగరేణిలో బిజెపి అనుబంధ సంఘం బిఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య గురువారం తెలంగాణ భవన్లో కెటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు ఇతర నేతలు కూడా టిఆర్ఎస్లో చేరారు. వారందరినీ పార్టీలోకి మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ... టిడిపి లో ఉండి సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారు అని ఎద్దేవా చేశారు. రేవంత్కు చిన్న పదవి రాగానే పిఎం పదవి వచ్చినట్లు ఫోజుకొడుతున్నారని విమర్శించారు. ఏడుసార్లు గెలిచి, 17 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డిని నాగార్జునసాగర్లో ఒక పిల్లాడు ఓడించిన విషయాన్ని గమనించాలన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారినవారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ అన్నారని, ఆయన పార్టీ మారినా నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు.. ఆయన్ని ఏ రాయితో కొట్టాలో చెప్పాలి అని ఘాటు విమర్శ చేశారు. రాజస్థాన్లో అశోక్ గహ్లౌత్ కూడా అదే చేశారు. ఆయన్ను కూడా రాయితో కొట్టాలా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది రాజ్యాంగ ప్రకారం టిఆర్ఎస్ ఎల్పీలో విలీనమయ్యారని చెప్పారు.
సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపును కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి పంపితే ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదని మంత్రి కెటిఆర్ చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ఎలుగెత్తుతామన్నారు. కెంగర్ల మల్లయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం అని ప్రకటించారు. ''తెలంగాణలో పాదయాత్రల సీజన్ మొదలవుతోంది. కొందరు నేతలు పోటాపోటీగా చేస్తామంటున్నారు. వారికి శుభాకాంక్షలు. ఆరోగ్యానికి మంచిదే. బండి సంజరు తిరగాలి. నేర్చుకోవాలి. కనీసం పాద యాత్ర చేస్తేనైనా పల్లెలు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివఅద్ధి చెందిన విషయం తెలుస్తుంది. హుజూరాబాద్లో అభివఅద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని సంజరు బాధపడుతున్నారు. కేంద్రం కూడా వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజి ఇస్తామంటే మేము వద్దంటున్నామా'' అని కెటిఆర్ ప్రశ్నించారు. దుబ్బాకలో గెలిచి జిహెచ్ఎంసి లో 4 సీట్లు పెరగగానే బిజెపి నేతలు ఎగిరెగిరి పడ్డారని... అనంతరం నాగార్జునసాగర్లో బక్కబోర్లా పడ్డారని, డిపాజిట్ కూడా రాలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి సిట్టింగ్ సీటు కూడా పోయిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్విప్ వినరుభాస్కర్, విప్లు బాల్కసుమన్, గువ్వల బాలరాజు, ఎంపి వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సాట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, బగ్గుగని కార్మిక సంఘం నేతలు వెంకటరాజు, రాజిరెడ్డి, సింగరేణి కార్మికులు, నేతలు పాల్గన్నారు.










