చిత్తూరు : రేవంత్ రెడ్డా ? కోవర్టు రెడ్డా ? అనేది ముందు చెప్పాలని ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం రోజా మీడియాతో మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించాల్సింది కేంద్రమేనని అన్నారు. రోజాగారింట్లో మంతనాలు జరిగాయి.. అంటూ.. రేవంత్ రెడ్డి చాలా మాట్లాడుతున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డి రోజా ఇంటికి ఎప్పుడొచ్చారో ఆయన ఓసారి చెబితే బాగుంటుదని అడిగారు. రేవంత్ రెడ్డా ? కోవర్టు రెడ్డా ? అనేది ముందు చెప్పాలన్నారు. తెలుగుదేశం కోవర్టులాగా కాంగ్రెస్లోకి వెళ్లి, టిడిపి గురువులనంతా కలిసి ఆయన చేస్తున్న రాజకీయాలను చూస్తేనే రేవంత్ రెడ్డి ఓ కోవర్టు రెడ్డి అని అర్థమవుతుందని ఆరోపించారు. రాజకీయపార్టీలో ఎదగాలి అంటే పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకెళ్లాలి కానీ ఎవరో ఒకరి మీద నింద వేయాలనుకుంటే మాత్రం ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు అని హెచ్చరించారు. రేవంత్ నాయకుడు చంద్రబాబు.. 28 రకాల వంటకాలతో కెసిఆర్కు దగ్గరుండి తినిపించిన విషయాన్ని మరిచిపోయారా ? అని అడిగారు. రోజా ఇంట్లో జగన్, కెసిఆర్ లు ఒప్పందాలు కుదుర్చుకున్నారని బిజెపి నేతలు మాట్లాడటం చాలా బాధాకరమన్నారు.










