న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలు, ప్రభుత్వం మధ్య 10వ విడత చర్చలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు రైతుల తరఫున వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చర్చల్లో పాల్గన్నారు. అయితే ప్రభుత్వ ప్రకటనలు చూస్తే.. ఈ సారి కూడా చర్చలు ఫలవంతమయ్యే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. కాగా, ఈ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని, ఆందోళనను విరమించే ప్రసక్తేలేదని రైతు సంఘాలు ప్రకటించాయి. చట్టాల సవరణలకు అంగీకరిస్తామని, అయితే పూర్తిగా చట్టాలను రద్దు చేసే అవకాశం లేదని కేంద్రం వాదిస్తోంది.










