పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న డిఐఇఒ
ప్రజాశక్తి-పీలేరు: జిల్లాలో సిసి కెమెరాల నిఘా నడుమ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ మీడియట్ విద్యాశాఖాధికారి (డిఐఇఒ) ఎం.కృష్ణయ్య తెలిపారు. సోమవారం ఆయన పట్టణంతో పాటు సమీప పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీచైతన్య, ప్రియదర్శిని, ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు కెవి పల్లి మండలంలోని ఎపిఆర్జెసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పరిధిలోని 75 పరీక్షా కేంద్రాల్లో 7,879 మంది విద్యార్థులు ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఆయా పరీక్షా కేంద్రాల నిర్వహణాధికారులు పాల్గొన్నారు.










