
ప్రజాశక్తి- నందిగామ : మీడియాపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులకు నిరసనగా నందిగామ తహశీల్దార్ కార్యాలయం వద్ద, ఏపీడబ్ల్యూజేఎఫ్, ఎ పి జె ఎఫ్, ది న్యూ ఇండియా జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్, పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నందిగామ జర్నలిస్టులు శుక్రవారం ఉదయం నిరసన తెలిపారు. అనంతరం నందిగామ తహశీల్దార్ నరసింహారావుకు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యుజేఎఫ్ జిల్లా నాయకులు ఆకుల వెంకటనారాయణ, జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు బయట పెడుతున్న మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు కట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ పై కేసులు కట్టడం హేయమైన చర్య అని ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. నందిగామలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వము ఇళ్ల స్థలాలు పక్క గహాలు నిర్మించాలని కోరారు. తహశీల్దార్ నరసింహారావు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నందిగామ జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలది సుగుణ శేఖర రావు, న్యూ ఇండియా జర్నలిస్టు అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు పటాన్ మీరా హుస్సేన్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాలడుగు సాంబశివరావు, శాఖమూరి మల్లికార్జునరావు, యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ నాయకులు షాన్ పాషా, జర్నలిస్టులు పాల్గొన్నారు.