పతకాలు సాధించిన క్రీడాకారులతో మాస్టర్లు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : తమిళనాడులోని రాజాయపాలెం పట్టణంలో నిర్వహించిన 19వ జాతీయ స్థాయి కర్రసాము పోటీలలో రాజంపేట పట్టణానికి చెందిన ఏకలవ్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారని మాస్టర్లు ఉద్దండపు బాలాజీ గణేష్, రెడ్డి ప్రవీణ్ తెలియజేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో రాజంపేట పట్టణం నుంచి నలుగురు విద్యార్థులు పాల్గొనగా అందులో రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించారని తెలిపారు. మినీ సబ్ జూనియర్స్ విభాగంలో డి.సహస్వి, సి.రుత్వికారెడ్డి రజత పతకాలు, జూనియర్ విభాగంలో వై.గంగాధర కాంస్య పథకం సాధించారని పేర్కొన్నారు. భారతదేశ సంప్రదాయ కళైన కర్రసాములో విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం పట్ల రాజంపేట వాసులు హర్షం వ్యక్తం చేశారు.










