ముంబయి : దేశద్రోహం కేసులో తమ వివరణను వినిపించేందుకు బాలీవుడ్ నటి కంగనా, ఆమె సోదరి శుక్రవారం బాంద్రా పోలీస్స్టేషన్కు వెళ్లారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు వై కేటగిరీ భద్రత మధ్య ఆమె పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. రెండు గంటల పాటు వారిని పోలీసులు విచారించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసిన 100 ట్వీట్లపై ఆమె వివరణను రికార్డు చేయాల్సి వుందని అన్నారు. కాగా, సోషల్మీడియా ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టారంటూ కంగనా, ఆమె సోదరి రంగోలిలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో అక్టోబర్ 17న మెజిస్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబయిని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతమైన పిఒకెతో పోల్చారంటూ ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది.










