పాట్నా : బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బోటు నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులుసహా 12 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గైఘాట్లోని బెనియాబాద్ ఒపి ప్రాంతంలోని మధుపూర పట్టి ఘాట్ వద్ద బోటు బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. నదికి ఆవతల ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు బయల్దేరారని, బోటు బ్యాలెన్స్ కోల్పోవడంతో బోల్తా పడిందని పేర్కొన్నారు. స్థానిక పోలీసులతోపాటు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఘటనా స్థలానికి జిల్లా సీనియర్ అధికారులను పంపించామని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. 20 మందిని రక్షించామని, మిగిలిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని ఎన్డిఆర్ఎఫ్ అధికారి రణదీర్సింగ్ తెలిపారు.










