Sep 17,2023 16:35

రాంచీ :   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సమన్లపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. తనకు జారీ చేసిన సమన్లను ఉపసంహరించుకోవాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గతంలో ఈడిని ముఖ్యమంత్రి హెచ్చరించిన సంగతి తెలసిందే. జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ జిల్లాలో అక్రమమైనింగ్‌ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై హేమంత్‌ సోరెన్‌ విచారణకు హాజరుకావాలని ఈడి గత నెలలో సమన్లు జారీ చేసింది. అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఒక గిరిజన నేతను కేసు పేరుతో వేధించేందుకు కేంద్రం పెద్ద కుట్ర పన్నిందని సోరెన్‌ మండిపడ్డారు. గతేడాది నవంబర్‌లో విచారణకు హాజరుకావాలన్న ఈడి సమన్లను దాటవేసి, ఓ వేడుకలో పాల్గనేందుకు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. ఈ వేడుకకు హాజరుకావాలని ముందుగానే షెడ్యూల్‌ నిర్ణయించబడిందని అన్నారు. తాము దొంగలమా, సంఘవిద్రోహశక్తులమా అని ప్రశ్నించారు.