హైదరాబాద్ : నగరంలో కాల్పులు కలకలం రేపాయి. గన్ఫౌండ్రీలోని ఎస్బిఐ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సర్దార్ఖాన్ జరిపిన కాల్పుల్లో కాంట్రాక్టు ఉద్యోగి సురేందర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మధ్య పరస్పర వాగ్వాదంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సర్దార్ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సురేందర్ ప్రస్తుతం హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పక్కటెముకల్లో బుల్లెట్లు దిగాయని, అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సర్దార్ ఖాన్ 20 ఏళ్లుగా అబిడ్స్లోని ఎబిఐ ప్రధాన కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. సురేందర్, సర్దార్ఖాన్ ఇద్దరూ స్నేహంగా ఉండేవారని, ఘటనకు ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్టు చెప్పారు.










