- అటవీ ఉత్పత్తుల అమ్మకానికి కార్పొరేట్తో జోడీ
- హాస్టళ్లకు చింతపండు, కారం, పసుపు సరఫరాకు ప్రణాళిక
ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : గిరిజనుల నుంచి గిరిజన సహకార సంస్థ (జిసిసి) సేకరిస్తోన్న అటవీ ఉత్పత్తులు, పంటల అమ్మకానికి కార్పొరేట్ సంస్థ అయిన బిగ్ బాస్కెట్తో జోడీ కట్టనుంది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ వసతి గృహాలకు చింతపండు, కారం, పసుపు సొంతంగా సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. వ్యాపారాభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. తద్వారా తన ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ ఉత్పత్తులు, ఆర్గానిక్ పంటలకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో, వీటి సేకరణ పెంచే దిశగా జిసిసి అడుగులు వేస్తోంది. ఈ సంస్థకు మార్కెటింగ్ నెట్ వర్క్ పరిమితంగా ఉంది. దీంతో, 'బిగ్ బాస్కెట్' సంస్థ ద్వారా ఉత్పత్తులను వినియోగదారుల దగ్గరకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. దీనివల్ల అమ్మకాలు పెరుగుతాయని, లాభాలు వస్తాయని భావిస్తోంది. ఇది విజయవంతం అయితే అటవీ, గిరిజన ఉత్పత్తులు ఎక్కువ మొత్తంలో సేకరించాలని అనుకుంటోంది. డిమాండ్కు అనుగుణంగా ముందుకు సాగాలని చూస్తోంది. రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, బిసి, ఎస్సి వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు నేరుగా కారం, పసుపు, చింతపండు సరఫరాకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో వివిధ దశల్లో చర్చలు జరిగాయి. సానుకూల స్పందన ఇస్తుందనే నమ్మకంతో జిసిసి ఉంది. గిరిజన సంక్షేమ హాస్టళ్లకు కాస్మోటిక్స్ పంపిణీ బాధ్యతను ఇప్పటికే జిసిసికి ప్రభుత్వం అప్పగించింది. జూన్ నుంచి కాస్మోటిక్స్ పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించి జిఒ కొద్ది రోజుల్లో రానున్నట్లు సమాచారం. దీనివల్ల జిసిసి సబ్బుల విక్రయం పెరగనుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి తేనె, పసుపు సరఫరా చేస్తోంది.
- అమ్మకాలు పెంచనున్నాం
ప్రభుత్వ వసతి గృహాలకు పసుపు, కారం, చింతపండు సరఫరా చేస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఇందుకు అనుమతి ఇస్తూ త్వరలో జిఒ రానుంది. ఈ దృష్ట్యా అటవీ, గిరిజన ఉత్పత్తుల సేకరణ పెంచనున్నాం. మరోవైపు బిగ్ బాస్కెట్ సంస్థ ద్వారా అటవీ ఉత్పత్తుల అమ్మకాలు పెంచాలని ప్రయత్నిస్తున్నాం. వీటివల్ల గిరిజనులకు మేలు జరగనుంది.
- జి.సురేష్కుమార్, జిసిసి ఎమ్డి










