ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నర్సాపురం ఎంపి కె.రఘురామ కృష్ణరాజుకు లోక్సభ సచివాలయం నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు లోక్సభ సచివాలయం ఎంపి రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదుపై గురువారం నోటీసులు జారీ చేసింది. రఘురామపై అనర్హత వేటు వేయాలని ఏడాది కిందటే వైసిపి పార్లమెంటరీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసిపి ఎంపిల బృందం కలిసింది. ఈ సందర్భంగా ఎంపి రఘురామపై వేటు వేయాలని కోరింది. అందులో భాగంగా అనర్హత పిటిషన్పై 15 రోజుల్లో సమాధానం చెప్పాలని లోక్సభ సచివాలయం నోటీసు జారీ చేసింది. ఆయనతోపాటు టిఎంసి నుంచి బిజెపిలో చేరిన సిసిర్ అధికారి, సునీల్ కుమార్ మండల్కు కూడా నోటీసులు జారీ చేసింది.










