రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - హిందూపురం : పట్టణానికి పోచనపల్లికి అనుసందానంగా ఉన్న పెన్న వంతెన గతంలో కురిసిన వర్షానికి కూలి పోయింది. ఆ సమయంలో ద్విచక్ర వాహనాలు, పాదచారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రూ.80లక్షలతో నూతన వంతెనను మంజూరు చేయించారు. అయితే పనులు వేగవంతంగా పూర్తి కాక పోవడంతో సమస్యను స్థానికులతో పాటు ఆటో నిర్వాహకులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ఆటో, ద్విచక్ర వాహనాలతో పాటు పాదచారులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులు శుక్రవారం బేవినహళ్లి సర్పంచి ఆనంద్, వైసిపి నాయకులు ఆనంద్ రెడ్డి, మల్లేష్, ప్రణరురెడ్డి తదితరులు పరిశీలించారు.










