Jul 23,2023 11:23

న్యూఢిల్లీ  :   హర్యానాలోని మరోసారి యమునా నది ప్రమాదకర స్థాయిని దాటింది. హర్యానాలోని హత్నికుండ్‌ బ్యారేజీ నుండి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటింది. ఈ ఉదయం 9 గంటలకు నదిలో 205.96 మీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. సాయంత్రానికి ఇది 206.7 మీటర్లకు పెరగవచ్చని అంచనా. హర్యానా నుండి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రభుత్వ అప్రమత్తమైంది. తమ ప్రభుత్వం పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి అతిషి పేర్కొన్నారు. హర్యానా బ్యారేజీ నుండి నీటిని విడుదల చేయడంతో యమునా నదీ ఉధృతంగా ప్రవహిస్తోందని చెప్పారు. నీటి మట్టం 206.7మీటర్లకు మించి పెరిగితే యమునా నది పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది.

జులై 25 వరకు హిమాచల్‌ప్రదేశ్‌,   ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలో భారీ  నుంచి  అతి భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని  భారత వాతవరణ శాఖ హెచ్చరించింది.   దీంతో ఢిల్లీకి మరింత వరద ముప్పు పొంచిఉన్నట్లయింది.  అయితే గత కొన్నిరోజులుగా ఢిల్లీలో యమునా నది 205.33 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి తగ్గినప్పటికీ.. మళ్లీ పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 13న యమునా నది 208.66 మీటర్లు ప్రవహించింది. అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తున్నది.