Nov 22,2023 08:20

న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం సాయంత్రం కంటే.. మంగళవారం ఉదయానికి కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయని కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి మంగళవారం పేర్కొంది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో నగరంలో గాలి నాణ్యతా స్థాయి (ఎక్యూఐ) 348 రికార్డు నమోదైంది. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో 365గా ఎక్యూఐ నమోదైంది. సోమవారం రాత్రి సమయంలో కాలుష్య స్థాయిలు పెరిగాయని కాలుష్య నియంత్రణా మండలి తెలిపింది.
కాగా, నాలుగు గంటల సమయంలో వరుసగా నమోదైన ఎక్యూఐ రికార్డులు ఇలా ఉన్నాయి. ఆదివారం 301, శనివారం 319, శుక్రవారం 405, గురువారం 419 రికార్డులు నమోదయ్యాయి. ఇక పొరుగున ఉన్న ఘజియాబాద్‌ (340), గురుగ్రామ్‌ (324), గ్రేటర్‌ నోయిడా 306, నోయిడా, 338, ఫరీదాబాద్‌ 336గా గాలి నాణ్యతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులపైనా, కాలుష్యానికి గురిచేసే ట్రక్కుల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను శనివారం కేంద్రం ఎత్తివేసింది.