Mar 03,2023 07:43

ట్టాల గురించి కనీస అవగాహన కలిగి ఉండడం దేశంలో ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం. మహిళలపై దాడులు, లైంగిక హింస, వేధింపులు భౌతికంగా నిర్మూలించడం లాంటి అఘాయిత్యాలను నిరోధించడానికి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సహా ఎన్నో చట్టాలున్నాయి కానీ అనునిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట వారి మాన ప్రాణాలను నిలువరించలేక పోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటువంటి దారుణాలు ఈ వారంలో వెలుగుచూశాయి. చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా ఉన్మాదం వంద రెట్లు అధికంగా ఉంది. గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, సతీసహగమన చట్టం, పోక్సో యాక్ట్‌, నిర్భయ చట్టం, దిశా, అశ్లీలత వ్యతిరేక చట్టాలు ఎన్ని వచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలను, ప్రేమోన్మాదుల దాడులను, యాసిడ్‌, లైంగిక దాడులను నివారించలేక పోయాయి. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది. రోజు రోజుకు పేట్రేగి పోతున్న అశ్లీల సినిమాలు సాహిత్యం, ప్రకటనలు, కట్టడి చేయలేని ప్రభుత్వాలు అనవసర విషయాల పట్ల శ్రద్ధ చూపించడం, కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయి తప్ప చేసిందేమీ లేదు. దిశ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలోపే దాదాపు ఇరవై మంది ఇంజనీరింగ్‌ చదివే అమ్మాయిలు దారుణ హత్యాచారాలకు గురయ్యారు. వార్తల కందని, నిరక్షరాస్యులైన అబలలు ఎందరో ?
 

                                                            మహిళలపై హింసకు పరిష్కారాలెక్కడ ?

అనేక చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై హింస కొనసాగుతూనే ఉంది .'నాకు దక్కనిది మరెవ్వరికి దక్కడానికి వీల్లేదు' అనే ధోరణి ఇప్పుడు యువతలో బాగా పెరిగిపోతోంది. అదో హీరోయిజంలా పరిగణిస్తున్నారు. శ్రద్ధగా చదువుకొని.. లైఫ్‌లో సెటిల్‌ అవ్వాల్సిన వయస్సులో చెడు ధోరణిలో పయనిస్తోంది. తాము ఏం చేసినా పెద్దగా శిక్షపడేదేమీ ఉండదన్న ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ప్రేమ పేరిట అమ్మాయిలపై నిత్యం దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటువంటి వారి పట్ల సంఘటనలు జరిగినప్పుడే సీరియస్‌గా పరిగణిస్తోంది ప్రభుత్వం. ఏదో కొద్ది రోజులు హడావిడి చేసి వదిలేస్తుండడంతో యువతలో ఆ పెడధోరణి నానాటికీ పెరుగుతోంది. తాజాగా ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. పరువు, ప్రతీకారం అంటూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కొందరు హత్యలకు పాల్పడుతున్నారు. మన దేశం సామాజికంగా ఇంకా వెనుకబడే వుంది. పరువు హత్యలతో కుటుంబాల్లో విషాదం తప్ప సాధించేదేమీ లేదు. సమాజంలో ఉన్మాదం పెరిగిపోవటానికి ప్రభుత్వాల బాధ్యత కూడా వుంది. సంక్షేమ పథకాల భారాన్ని మద్యం అమ్మకాల ద్వారా పూడ్చుకోవాలని చూస్తుంటే విచ్చలవిడితనం, నేరప్రవృత్తి పెరుగుతుంది. మానవత్వం మరిచి క్రూరంగా ప్రవర్తించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. ప్రసార మాధ్యమాలు బ్రేకింగ్‌ న్యూస్‌, షాకింగ్‌ న్యూస్‌ అంటూ హింసాత్మక ఘటనలు పదే పదే చూపుతుంటే యువతపై దాని ప్రభావం పడుతుంది. టీవీ చానళ్లు స్వీయ నియంత్రణ పాటిస్తే సమాజానికి మేలు చేసినట్టే. పోలీసులు నిందితుల్ని శిక్షించడంలో విఫలమవుతున్నారు. కొన్ని రాజకీయ ప్రాధాన్యం ఏర్పడే కేసుల్లో మాత్రమే సీఎం పరిహారం ప్రకటిస్తున్నారు. దాంతో మొత్తం వ్యవహారం సద్దుమణుగుతోంది. ప్రభుత్వం తరఫున ఇదే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తే భవిష్యత్తులో హింస పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధి లేకుండా యువతను నిర్వీర్యం చేసిన ఘనత మన పాలకులది. ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించిన వారిలో తొంభై శాతం మందికి ఉద్యోగాలు లేవు, ప్రయివేటు రంగంలో పనిచేసే వారికి అరవై శాతం మందికి జీతాలు లేవు.
 

-డాక్టర్‌. ముచ్చుకోట సురేష్‌ బాబు,
9989988912