Sep 07,2023 20:46

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) :ప్రేమించిన వ్యక్తితో తన కుమార్తెకు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆదర్శ వివాహం జరిపించారు. పట్టణానికి చెందిన పవన్‌ కుమార్‌ను తన పెద్ద కుమార్తె పల్లవి ప్రేమించిందని తెలుసుకొని ఆయన తల్లిదండ్రులతో చర్చించి గురువారం ఉదయం బల్లవరం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వివాహం జరిపించారు. అనంతరం స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ.. ప్రేమించిన అబ్బాయితో తన కుమార్తెకు వివాహం జరిపించడం సంతోషంగా ఉందన్నారు. చదువుకుంటున్న సమయంలోనే తన కుమార్తె ఒక అబ్బాయిని ప్రేమిస్తే వారి స్థాయి, కుల మతాలు చూడకుండా తన కుమార్తె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ వారిద్దరికీ వివాహం జరిపించానని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు కుటుంబ సభ్యులు కిరణ్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.