
- మోడీ సర్కారు తీరుపై సిపిఎం రాజ్యసభ పక్షనేత ఎలమరం కరీం విమర్శ
- ఆమోదం పొందిన వెంటనే అమలు చేయాలి
- బిల్లుకు సిపిఎం సంపూర్ణ మద్దతు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే మోడీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొచ్చిందని, మహిళలకు సాధికారత సాధించాలనే తపనతో కాదని సిపిఎం రాజ్యసభ నేత ఎలమరం కరీం విమర్శించారు. గురువారం రాజ్యసభలో మహిళా బిల్లుపై జరిగిన చర్చలో సిపిఎం తరపున ఆయన మాట్లాడారు. ''కర్ణాటక అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బిజెపికి భయం పట్టుకుంది. జనం తన వెంట లేరన్న భయమే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని బిజెపిని ఒత్తిడి చేసింది. కానీ, నారీ శక్తి బంధన్ లక్ష్యం కాదు. సిపిఎం బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. కానీ జనాభా లెక్కల కోసం వేచి ఉండకండి'' అని అన్నారు. ''యుపిఎ హయాంలో రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. సోనియాగాంధీ, బృందాకరత్ బిల్లు కోసం గట్టిగా నిలబడ్డారు. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ దృఢ వైఖరి కూడా నిర్ణయాత్మకమైంది. కానీ, లోక్సభలో బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వంటి మహిళా సంఘాల సుదీర్ఘ పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్ బిల్లు. 2014లో మహిళా బిల్లును ప్రవేశపెడతామని బిజెపి హామీ ఇచ్చినా.. ఐదేళ్లుగా ఏమీ చేయలేదు. 2019లోనూ బిజెపి అదే హామీ ఇచ్చినా... నాలుగున్నరేళ్లుగా ఏమీ చేయలేదు'' అని విమర్శించారు.
''మణిపూర్లో మహిళలను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినప్పుడు, బిజెపి మహిళలపై ప్రేమ చూపలేదు. దేశం గర్వించదగ్గ మల్లయోధులను బిజెపి నాయకుడే అయిన ఫెడరేషన్ అధ్యక్షుడు వేధించినప్పుడు కూడా మహిళలపై ప్రేమ కనిపించలేదు. ఉన్నావ్, కత్వా, హత్రాస్లలో మహిళా సాధికారతపై బిజెపికి ఉన్న ఆసక్తి స్పష్టంగా కనిపించలేదు'' అని విమర్శించారు.
''తదుపరి జనాభా లెక్కల అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వచ్చే 15 ఏళ్లలో రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేదా అనేది కచ్ఛితంగా తెలియదు. బెంగాల్లో 1983లోనే పంచాయతీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. కేరళలో స్థానిక సంస్థల్లో యాభై శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి?'' అని ఎలమరం కరీం ప్రశ్నించారు.